తిరుపతి (న్యూస్ రీడ్) : రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని గంగమ్మను వేడుకున్నానని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతి గంగ జాతర సందర్భంగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి గంగమ్మకు సారె సమర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మంత్రి అంబటి రాంబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రాంబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతితో పాటు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. కిందటేది కూడా గంగ జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించి, దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.గత ఏడాది కంటే ఈసారి ఇంకా అద్భుతంగా జాతర జరుగుతోందని వివరించారు.కొండమీద బ్రహ్మోత్సవాల తరహాలో ఇక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి వారి చెల్లి గంగమ్మ తల్లికి జాతర నిర్వహిస్తుండడం సంతోషకరమని మంత్రి అన్నారు. హైందవ సంస్కృతి, భక్తి మరుగున పడిపోతున్న దశలో శాసన సభ్యులు
భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. మిత్రుడు భూమన కరుణాకర రెడ్డి ప్రోద్బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ఇది వారికి సంప్రదాయల పట్ల, హైందవ మతం పట్ల ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీ యాదవ్, ఈవో మునికృష్ణ పాల్గొన్నారు.
గంగమ్మ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమ్మా: రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు
RELATED ARTICLES