న్యూస్ రీడ్ (తిరుపతి): సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే.వెంకట రమణా రెడ్డి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లో జరిగిన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు.కాలువలకు అడ్డంగా రాళ్లను పెట్టడం వల్ల నీరు నిల్వ వుంటుందని, వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా కాలువలకు అడ్డంగా రాళ్లు, జాలీలు వంటివి పెడితే ఆ ఇంటి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని ప్రధాన వైధ్యాధికారికి సూచించారు. రోడ్లు, కాలువలను రోజూ శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.