No.1 Short News

Newsread
ఐటీ పార్క్ పేరుతో వక్ఫ్ భూములు ప్రైవేటుకు అప్పగిస్తే సహించం
అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన వక్ఫ్ భూములను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరిఫాతిమా, తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1915 సంవత్సరంలో చిన్న కాకాని గ్రామంలో సర్వే నంబర్లు 187/1, 201/A,B, 201/2B, 202/B, 203/A,B, 204/A,C&D, 222/2A & 2Bలలో ఉన్న మొత్తం 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు అందజేశారని వారు గుర్తు చేశారు. ఈ భూమిని కేవలం ముస్లింల స్కిల్ డెవలప్‌మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, విద్యాసంస్థల ఏర్పాటు కోసమే వినియోగించాలని దాతలు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అయితే వక్ఫ్‌బోర్డు ద్వారా ఈ భూమిలోని 71.57 ఎకరాలను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని విమర్శించారు. వక్ఫ్‌బోర్డు కమిటీకి కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం ఉండగా, 30–40 సంవత్సరాల లీజుల ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా టెండర్ల ప్రకటనలు చేయడం కూడా చట్టవిరుద్ధమని, ఇది ముస్లిం సమాజాన్ని మరింత వెనుకబాటుకు నెట్టే చర్యగా అభివర్ణించారు. వక్ఫ్ భూముల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వక్ఫ్‌బోర్డు సీఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరారు. చిన్న కాకాని అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన 81.23 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచనను విరమించుకోని పక్షంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ముస్లిం సంఘాలతో కలిసి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని వారు హెచ్చరించారు.
23 Dec 2025 16:59 PM
5
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.