అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుల జాబితా సిద్ధం, ఇలా చెక్ చేసుకోండి!
సిద్ధమైన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా - రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అర్హులైన రైతుల పేర్ల జాబితాలు
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు.
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని డిల్లీరావు స్పష్టం చేశారు. వివరాలు రైతులకు మరింత చేరేలా వ్యవసాయ శాఖ సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలని డిల్లీరావు ఆదేశించారు.
అర్హులుగా 47.77 లక్షల రైతులు: 'అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని ఢిల్లీరావు వివరించారు.
సొంతభూమి కలిగిన డీ.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్ల్యాండ్లో ఆధార్ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు, నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు
భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతోపాటు ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలని ఢిల్లీరావు సూచించారు. అర్హత ప్రకారం అందరికి లబ్ధి చేకూరుస్తామని అక్టోబరు, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ మొత్తాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీరావు అన్నారు.
వెబ్ల్యాండ్ డేటాను వారి లాగిన్లకు: రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే) వారీగా వెబ్ల్యాండ్ డేటాను వీఏఏలు, వీఎస్ఏలు, వీహెచ్ఏలతో పాటు ఏవోల లాగిన్లకు ఇచ్చారు. వెబ్ల్యాండ్లో సర్వే నంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం కచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది రైతు సేవా కేంద్రాల సహాయకులు పరిశీలించి కచ్చిత వివరాలను మండల వ్యవసాయాధికారులకు వారు జిల్లా వ్యవసాయాధికారికి నివేదించాలి.