సోషల్ మీడియాలో లేనిపోనివి ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: ప్రకాశం ఎస్పీ
ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ వంటివి వాడుకొని అసభ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పోలీసులు తీవ్ర దృష్టి సారించారని తెలిపారు.
మహిళలపై, ఇతరులపై కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, కులం-మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం లాంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవన్నారు.
సోషల్ మీడియా వేదికలపై పోలీస్ శాఖ నిరంతర నిఘా పెట్టి వ్యవహరిస్తోందని ఎస్పీ గారు తెలిపారు.
సమాజాన్ని కలవరపెట్టేలా కాకుండా, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. యువత సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.