

No.1 Short News
Newsreadవిద్యార్థుల ప్రతిభ వికాసానికి హ్యాపీ సండే కార్యక్రమం : డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్ గర్ల్స్ బీసీ హాస్టల్లో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, విద్యార్థులు ఆదివారం రోజున ఆనందంగా ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడపాలని, మిగిలిన ఆరు రోజులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. చదువు ద్వారానే జీవితానికి సరైన దిశ లభిస్తుందని, కుటుంబాభివృద్ధితో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు వంటి నైపుణ్యాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సరికొత్త విద్యా విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టి, పరిశుభ్రతతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించడమే హ్యాపీ సండే కార్యక్రమ లక్ష్యమని వివరించారు.
గతంలో కూడా బీసీ హాస్టల్ను సందర్శించానని, విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా వార్డెన్కు తెలియజేయవచ్చని చెప్పారు. బాత్రూంల శుభ్రత, మంచినీరు, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దర్శి మండల తహసీల్దార్ శ్రవణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్లు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
అనంతరం దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు కుమార్తె మన్విత శివ సాయి పుట్టినరోజు సందర్భంగా హాస్టల్లోని విద్యార్థినులందరికీ స్వెటర్లు పంపిణీ చేశారు.