రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకుడికి మానవత సంస్థ ఆర్థిక సహాయం
దర్శి, ప్రకాశం జిల్లా:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు, కాలికి శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం మంచానికే పరిమితమై, గతంలో భార్యను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్న ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలోని బంగారమ్మగుట్ట గ్రామానికి చెందిన రాచగొర్ల రాజయ్య అనే యువకుని దీనస్థితి మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు తెలియడంతో, సంస్థ సభ్యులు మానవతతో ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఈ రోజు దరశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య, అత్యవసర విభాగం డైరెక్టర్ రోశారావు, సభ్యులు నారాయణ తదితరులు బంగారమ్మగుట్ట గ్రామంలోని బాధితుని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి మనోధైర్యం నింపుతూ సంస్థ తరఫున ₹5,000/- నగదును అందజేసి ఆత్మీయ సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ మహోన్నత ఆశయాలతో, విలువలతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 141 కేంద్రాల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మానవతామూర్తులు ఈ సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని, సంస్థ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు.