ముళ్ళ పొదల్లో దొరికిన అమ్మాయి, IAS కావడమే లక్ష్యం గా...
పూజా ఈమాన్:
2008లో తిరుపతి సమీపంలోని రేణిగుంటలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి ముళ్లపొదల్లో పడేయగా, స్థానికులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాపను, సమీపంలో ఉన్న తల్లిని మైలవరంలోని రాజా ఫౌండేషన్కు తీసుకెళ్లారు.. ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు రాజారెడ్డి, అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమాన్ అని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు రాజారెడ్డి ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ అదే స్కూల్లో పూజా చదువుకుంది. పదో తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ (హెచ్పీజీ)లో చేరింది.. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది, ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది.. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సర్ నన్ను పెంచారు. నేను కలెక్టర్ కావాలనేది ఆయన కల, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా. పేదలకు, ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయం అని పూజా ఈమాన్ తెలిపింది.