ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో యాంకర్గా విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ పూర్ణ చందర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో తన నివాసంలో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్వేచ్ఛ గతంలో తన తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి రామ్ నగర్లోని వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసించగా, ఇటీవల జవహర్ నగర్లోని ఒక ఇంటికి మారినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒక వ్యక్తితో మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా టీవీ9 సహా పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో జర్నలిస్ట్గా, యాంకర్గా పనిచేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె ఈసీ మెంబర్గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.